ముంబై: ప్రఖ్యాత సంతూర్ సంగీత విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 84 ఏళ్లు. గుండెపోటుతో ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు. సంతూర్ సరిగమలను ఆయన ప్రపంచవ్యాప్తం చేశారు. క్లాసికల్ మ్యూజికల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవాళ ఉదయం 8.30 నిమిషాలకు శివకుమార్ ప్రాణాలు విడిచినట్లు ఆయన సెక్రటరీ దినేశ్ తెలిపారు. వాస్తవానికి వచ్చేవారం భోపాల్లో జరిగే ఓ కచేరీలో ఆయన తన కళాప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. చాన్నాళ్ల నుంచి ఆయన మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన భార్య మనోరమా, కుమారులు రాహుల్, రోహిత్లు ఉన్నారు. శివకుమార్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. పండిట శివకుమార్ మృతితో సాంస్కృతిక లోకం చిన్నబోయిందని, సంతూర్ సంగీత కళను ఆయన విశ్వవ్యాప్తం చేశారని, రాబోయే తరాలను కూడా ఆయన మ్యూజిక్ ఓలలాడిస్తుందని, ఆయనతో ఉన్న సంబధాలను మోదీ గుర్తు చేసుకున్నారు. శివకుమార్ మృతి పట్ల ఆయన కుటుంబసభ్యులకు మోదీ సంతాపం తెలిపారు.