కోల్కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసులో (RG Kar rape-murder case) సంజయ్ రాయ్ దోషిగా తేలడంపై బాధితురాలి తల్లి స్పందించింది. అతడు ఒక్కడే నిందితుడు కాదని తెలిపింది. నేరానికి పాల్పడిన మిగతా వారిని ఇంకా అరెస్ట్ చేయలేదని ఆమె ఆరోపించింది. సంజయ్ సహచరులు, ఇతర నేరస్థులను అరెస్ట్ చేసి శిక్షించే వరకు న్యాయం కోసం తాము ఎదురు చూస్తామని చెప్పింది. ‘సంజయ్ దోషి అని జీవసంబంధమైన ఆధారాల ద్వారా నిరూపితమైంది. కోర్టులో విచారణల సమయంలో అతడు మౌనంగా ఉన్నాడు. నా కుమార్తెను హింసించి చంపడంలో అతడి పాత్రను ఇది నిరూపించింది. కానీ అతడు ఒంటరిగా లేడు. ఇతరులను ఇంకా అరెస్టు చేయలేదు. కాబట్టి, మాకు ఇంకా న్యాయం జరుగలేదు’ అని మీడియాతో ఆమె అన్నారు.
మరోవైపు, ఈ కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని బాధితురాలి తల్లి తెలిపింది. తాను, తన భర్త జీవించే చివరి రోజు వరకు న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ఆమె చెప్పింది. ‘కేసు పూర్తి కాలేదు. మా కుమార్తె హత్యాచారంలో పాల్గొన్న ఇతర నిందితులకు శిక్ష పడిన తర్వాత మాత్రమే ఇది పూర్తవుతుంది. ఆ రోజు కోసం మేం వేచి ఉంటాం. ఆ రోజు వరకు మేం నిద్రపోలేం. మేం కోరుకునేది అదే’ అని ఆమె అన్నారు.
కాగా, గత ఏడాది ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా సీల్దా సీబీఐ కోర్టు శనివారం నిర్ధారించింది. జనవరి 20న అతడికి శిక్షలు ఖరారు చేస్తామని కోర్టు వెల్లడించింది.