Goa | గోవా ఎన్నికలకు ముందు మాజీ సీఎం మనోహర్ పరిక్కర్ కుమారుడు ఉత్పల్ పరీక్కర్ అగ్గి రాజేశారు. పణాజి సీటు తనకు కేటాయించాల్సిందేనని మంకుపట్టు పట్టుకు కూర్చున్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర మాజీ సీఎం, గోవా ఎన్నికల వ్యవహారాల ఇన్ఛార్జీ దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు ఇదే వివాదాన్ని అన్ని పార్టీలూ బ్రహ్మాస్త్రంగా మలుచుకుంటున్నాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇదే విషయంపై సోమ వారం ట్వీట్ చేశారు. మనోహర్ పర్రీకర్ కుమారుడు ఉత్పల్ గనక ఎన్నికల గోదాలోకి దిగితే, బీజేపీయేతర పార్టీలన్నీ ఆయనకు మద్దతివ్వాలని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. మాజీ సీఎం మనోహర్ పరీక్కర్కు మనమిచ్చే నిజమైన నివాళి ఇదే… అంటూ పిలుపునిచ్చారు. శివసేన ఈ మేరకు ట్వీట్ చేసిన నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఇరకాటంలో పడినట్టైంది.
‘ఒకవేళ పణాజి నుంచి స్వతంత్ర అభ్యర్థి ఉత్పల్ పరీక్కర్ బరిలోకి దిగితే బీజేపీయేతర పార్టీలన్న మద్దతివ్వాలి. ఆప్, కాంగ్రెస్, తృణమూల్, గోవా ఫార్వర్డ్ పార్టీ.. వీరందరూ ఆయనకు మద్దతివ్వాలని నేను ప్రతిపాదిస్తున్నా. ఆయనకు వ్యతిరేకంగా ఎవ్వరూ అభ్యర్థిని నిలపకూడదు. మనోహర్ పరీక్కర్కు మనమిచ్చే నిజమైన నివాళి ఇదే’ అంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
పణాజి నుంచి బరిలోకి దిగాలని ఉత్పల్ పరీక్కర్ బలంగా నిర్ణయించుకున్నారు. కానీ అధిష్ఠానం మాత్రం అంత సులువుగా అనుమతి మంజూరు చేయడం లేదు. ఉత్పల్కు బదులుగా మరొకరిని రంగంలోకి దింపాలని నిర్ణయించుకుంది. ఇదే విషయంపై గోవా వ్యవహారాల ఇన్ఛార్జీ ఫడ్నవీస్ను అడగ్గా.. ఓ మాజీ సీఎం కుమారుడు , తమ పార్టీ నేత కుమారుడైనంత మాత్రాన టిక్కెట్ ఇవ్వలేము కదా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో ఉత్పల్ మరింత అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నేర చరిత ఉన్న వారికి టిక్కెట్ ఎలా ఇస్తారంటూ పార్టీ అధిష్ఠానంపై మండిపడ్డారు. అభ్యర్థుల సమగ్రతకు, వారి పరివర్తనను అధిష్ఠాన పరిగణనలోకి తీసుకోదా? అంటూ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.