ముంబై : భూ కుంభకోణం కేసులో శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణ అధికారుల ఎదుట హాజరు కావాలని ఇప్పటికే సంజయ్ రౌత్కు ఈడీ సమన్లు జారీ చేయగా ఆయన హాజరు కాలేదు.
ఈడీ ఎదుట హాజరయ్యేందుకు తనకు మరింత సమయం కావాలని ఆయన కోరారు. సంజయ్ రౌత్ భార్య, ఆయన అనుచరులకు చెందిన రూ 11 కోట్ల విలువైన ఆస్తులను మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ అంతకుముందు అటాచ్ చేసింది.
ముంబైలోని గోరేగావ్ సబర్బ్ ప్రాంతంలోని ఓ ప్రాజెక్టు రీడెవలప్మెంట్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపడుతోంది. మరోవైపు మహారాష్ట్ర సంక్షోభం నేపధ్యంలోనే శివసేన నేత సంజయ్ రౌత్పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగిస్తోందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. తాను ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.