ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేయరని, శివసేనకు రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని ప్రజల్లో ఎండగడతామని ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. పార్టీ కోసం తాము రక్తం, స్వేదం చిందించామని శివసేను ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. శివసైనికులు వీధుల్లోకి వస్తే అగ్గిరాజుకుంటుందని హెచ్చరించారు.
మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలపై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెబెల్ ఎమ్మెల్యేల ఇండ్లు, కార్యాలయాలపై దాడులు చేపట్టారు. పుణేలోని బాలాజీ ప్రాంతంలో పార్టీ ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయాన్ని పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలతో చేతులు కలిపిన సావంత్ ప్రస్తుతం అసోంలోని గువహటిలో ఏక్నాథ్ షిండే నిర్వహిస్తున్న క్యాంప్లో ఉన్నారు.
రెబెల్ ఎమ్మెల్యేలకు భద్రతను సీఎం, హోం మంత్రి ఉపసంహరించారని షిండే శిబిరం చేస్తున్న ఆరోపణలను మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేలకు భద్రతను ఉపసంహరించాలని సీఎం లేదా హోం శాఖ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని హోం మంత్రి పాటిల్ స్పష్టం చేశారు.