ముంబై : అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య పెరగడంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తీవ్రరూపు దాల్చింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా మెజారిటీ సేన ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే గూటికి చేరిన క్రమంలలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో ఠాక్రే సర్కార్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమను వీడిన ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ గూటికి చేరేలా అవకాశం ఇచ్చామని, అయినా వారు స్పందించడంలో చాలా జాప్యం జరిగిందని అన్నారు. వారు ముంబైలో అడుగుపెట్టాలని తాము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. బలపరీక్షకు సిద్ధం కావాలని రెబెల్ ఎమ్మెల్యేలకు రౌత్ సవాల్ విసిరారు.
ఎంవీఏ ప్రభుత్వం మిగిలిన రెండున్నరేండ్ల పదవీ కాలం పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బలపరీక్షలో తాము విజయం సాధిస్తామని రెబెల్ ఎమ్మెల్యేలు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో పాటు కాంగ్రెస్ నేతలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. రెబెల్ శిబిరంలోని 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం డిప్యూటీ స్పీకర్కు లేఖ రాసింది.