ముంబై : తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో దేశ తొలి త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణించిన ఘటనపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఘటనపై ప్రజల మనసుల్లో పలు ప్రశ్నలు మెదులుతున్నాయని అన్నారు. అత్యంతాధునిక, సురక్షితమైన హెలికాఫ్టర్లో దేశ సుప్రీం కమాండర్ ప్రయాణిస్తుంటే ఈ ప్రమాదం ఎలా జరిగిందని రౌత్ ప్రశ్నించారు.
ఇది అత్యంత దురదృష్టకర ఘటనని, దేశ సుప్రీం కమాండర్ సురక్షితమైన ఆధునిక హెలికాఫ్టర్లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం ఎలా జరిగిందని, టాప్ కమాండర్ను ప్రమాదంలో ఎందుకు కోల్పోయామని ప్రజల మనసుల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయని శివసేన ఎంపీ గురువారం ట్వీట్ చేశారు. సీడీఎస్ బిపిన్ రావత్ బుధవారం మధ్యాహ్నం తమిళనాడులోని సులూర్ నుంచి వెల్లింగ్టన్కు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూనూర్ సమీపంలో కుప్పకూలడంతో బిపిన్ రావత్, ఆయన భార్య 11 మంది ఇతరులు మరణించారు.