ముంబై: శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) సామ్నా (Saamana) పత్రికలో ప్రధాని నరేంద్రమోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హోదాలో సామ్నా వీక్లీ కాలమ్లో ఈ మేరకు రౌత్ వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్న నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో శివసేన అధికారిక పత్రిక సామ్నా వీక్లీ కాలమ్లో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ సంజయ్ రౌత్ ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
రౌత్ వ్యాసంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా బీజేపీ కన్వీనర్ నితిన్ భూతడ స్థానిక పోలీస్ స్టేషన్లో సంజయ్ రౌత్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నితిన్ ఫిర్యాదు మేరకు రౌత్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.