చెన్నై: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) గతంలో అనేక సార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సీఎం విజయ్ బలపరీక్ష సమయంలో కూడా ఆయన మాట్లాడుతూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దానిపై గురువారం ఉదయనిధి స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు. సనాతన విధానాలను నిర్మూలించడం అంటే.. ప్రజలు గుడికి వెళ్లకూడదని కాదు అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఇవ్వాలని, ఆలయాల్లోనే కాదు, యావత్ సమాజంలో సమానత్వం పాటించాలన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన తన ప్రసంగంపై వస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రజలను విభజిస్తున్న సనాతన ధర్మాన్ని నాశనం చేయాలన్నది తన ఉద్దేశమన్నారు. అయితే తనపై వస్తున్న విమర్శలకు తలొగ్గేది లేదన్నారు.
హిందువులకు కాదు, హిందుత్వకు వ్యతిరేకం : టీవీకే
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీవీకే తోసిపుచ్చింది. సనాతన ధర్మాన్ని స్టాలిన్ తప్పుగా అర్థం చేసుకున్నారని తమిళనాడు మంత్రి, టీవీకే జనరల్ సెక్రటరీ అధవ అర్జున తెలిపారు. ఆ సబ్జెక్టులో స్టాలిన్కు సరైన అవగాహన లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం సెక్యులర్ విధానాలను పాటిస్తున్నట్లు చెప్పారు. అన్ని మతాల ప్రజలకు తమిళనాడు ప్రభుత్వం గౌరవం ఇస్తుందని, సమానత్వ సూత్రంలో ఉన్న పరమార్థం అదే అని అర్జున తెలిపారు. సనాతన ధర్మం అంటే ఉదయనిధి స్టాలిన్కు తెలియదని, హిందువులు.. ముస్లింలు, క్రైస్తవులు.. అందర్నీ మేం సమానంగా చూశామని చెప్పారు.
వ్యక్తిగతంగా తనకు ఎటువంటి మతం లేదని అర్జున అన్నారు. కానీ మంత్రిగా అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తానన్నారు. రాజకీయ వ్యతిరేకతను మత వ్యతిరేకతతో పోల్చలేమన్నారు. మేం హిందువులకు వ్యతిరేకం కాదు అని, కానీ హిందుత్వకు వ్యతిరేకం అన్నారు. హిందుత్వ అంటే ఇతరులపై తమ మతాన్ని రుద్దడమే అని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి దేశంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఉత్తర భారత దేశంలో సనాతన ధర్మం అంటే దాన్ని హిందుమతం విశ్వాసాలతో పోల్చుతారన్నారు. కానీ తమిళనాడులో రాజకీయ, సామాజిక కోణం ఉంటుందన్నారు. కుల పెత్తనం, అసమానత్వం ఉంటాయన్నారు. తమిళనాడులో సనాతనం అంటే అసమానత్వం అన్నారు. తమ పార్టీ ఎప్పుడూ అసమానతకు వ్యతిరేకంగా ఉంటుందని, కానీ ఏ మతానికి కాదు అని అర్జున తెలిపారు. రాజకీయ క్షేత్రాల్లో సనాతనం గురించి మాట్లాడుతునప్పుడు, ఉదయనిధి స్టాలిన్ దీనిపై బహిరంగంగా స్పష్టతను ఇవ్వాలన్నారు.