ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తండ్రి ధ్యాన్దేవ్ కచ్రూజీ వాంఖడే, తాజాగా మంత్రి నవాబ్ మాలిక్పై రూ.1.25 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం పరువు పోయిందని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తాము మోసం చేసినట్లు ఆరోపించడంతోపాటు హిందువులం కాదంటూ తమ మత విశ్వాసాలను మంత్రి మాలిక్ ప్రశ్నించారని దావా పిటిషన్లో పేర్కొన్నారు.
అంతేగాక క్రిమినల్ లాయర్ అయిన తన కుమార్తె యాస్మిన్ ప్రాక్టీస్ను ఆయన నాశనం చేస్తున్నారని వాంఖడే తండ్రి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా, పరువు నష్టం కలిగించే విషయాలను రాయడం, మాట్లాడటం లేదా ప్రచురించడం వంటివి చేయకుండా మంత్రి మాలిక్, ఎన్సీపీ సభ్యులపై శాశ్వత నిషేధం విధించాలని కోర్టును కోరారు. ఈ పరువు నష్టం దావాపై బాంబే హైకోర్టు సోమవారం విచారణ జరుపనున్నది.
కాగా, దేశవ్యాప్తంగా కలకలం రేపిన క్రూయిజ్-డ్రగ్స్ కేసు వ్యవహారం పలు మలుపులు తిరుగుతున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్లో కీలకంగా వ్యవహరించిన ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తొలి నుంచి పలు ఆరోపణలు చేస్తున్నారు.
అధికారి సమీర్ వాంఖడే సొంతంగా ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసి డ్రగ్స్ కేసులు మోపిన వ్యక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. ఆర్యన్ ఖాన్ను కిడ్నాప్ చేసి భారీగా డబ్బులు డిమాండ్ చేసేందుకు కుట్ర జరిగిందని, ఇందులో బీజేపీ నేత మోహిత్ భారతీయ కీలక పాత్ర ఉన్నదని తాజాగా ఆయన ఆరోపించారు.