ముంబై: మహారాష్ట్రలో ఇటీవల నిత్యం వార్తల్లో నిలిచిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే టెర్మ్ డిసెంబర్ 31తో ముగిసింది. అయితే సర్వీస్ పొడిగింపుపై ఆయన నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదని ఎన్సీబీ తెలిపింది. దీంతో సమీర్ వాంఖడే సోమవారం ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) డైరెక్టర్కు రిపోర్ట్ చేసినట్లు పేర్కొంది.
కాగా, బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను అరెస్ట్ చేసిన క్రూయిజ్ డ్రగ్స్ కేసులో సమీర్ వాంఖడే కీలకంగా వ్యవహరించారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అల్లుడిని కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సమీర్ వాంఖడే, ఆయన కుటుంబంపై మంత్రి మాలిక్ పలు అవినీతి, సంచలన ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి మాలిక్పై సమీర్ వాంఖడే తండ్రి పరువునష్టం దావా వేశారు.
మరోవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన సీనియర్ నేత, మంత్రి అయిన నవాబ్ మాలిక్ తాజాగా సమీర్ వాంఖడేపై మరో ఫిర్యాదు చేశారు. 1997 అక్టోబర్ 29 నుండి ఇప్పటి వరకు ఆయన పేరు మీద పర్మిట్ రూమ్, బార్ లైసెన్స్ ఉందని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐటీ విజిలెన్స్ విభాగంతోపాటు కస్టమ్స్ శాఖకు సోమవారం లేఖ రాశారు.