న్యూఢిల్లీ, ఆగస్టు 17: సీయూఈటీ యూజీ పరీక్షల నిర్వహణలో గందరగోళం కొనసాగుతున్నది. దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పలు విడుతలుగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలో సాంకేతిక కారణాలతో ఇప్పటికే చాలా కేంద్రాల్లో పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం నిర్వహించిన నాలుగో విడుత పరీక్షలో కూడా సాంకేతిక లోపాలతో చాలా కేంద్రాల్లో పరీక్షను రద్దుచేశారు.
మరికొన్ని కేంద్రాల్లో నిర్ణీత సమయం కంటే దాదాపు 2 గంటలు ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది. సర్వర్ సమస్యలు, ఇతర సాంకేతిక లోపాలు తలెత్తాయని పేర్కొంటూ తమను పరీక్షా కేంద్రాల నుంచి వెనక్కు పంపేశారని పలు చోట్ల విద్యార్థులు తెలిపారు. ఇలాంటి విద్యర్థులందరికీ మళ్లీ పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం వాస్తమేనని యూజీసీ చైర్మన్ జగదీశ్కుమార్ అంగీకరించారు.