ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఫ్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ హెచ్చరించారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్కు గురువారం రాత్రి మెసేజ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నంబర్ ఎవరిది, మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కొనే పనిలో పడ్డారు. అసలు ఆ మెసేజ్లో ఏముందంటే..
‘ఈ బెదిరింపులను తేలికగా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో శత్రుత్వానికి సమాప్తం పలకాలన్నా ఆయన రూ.5కోట్లు చెల్లించాలి. ఈ డబ్బులు ఇవ్వకపోతే ఇటీవల హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే ఆయన దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.’ అని దుండగులు బెదిరించారు.
ఈ నేపథ్యంలో బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటివద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఆయనకు పలుమార్లు బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా, సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హర్యానాలోని పానిపట్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
A threatening message has been received on the WhatsApp number of Mumbai Traffic Police, in which Rs 5 crore has been demanded from actor Salman Khan. The sender claimed, “Don’t take it lightly, if Salman Khan wants to stay alive and wants to end the enmity with Lawrence Bishnoi,…
— ANI (@ANI) October 18, 2024
1998 కృష్ణ జింక కేసు నుంచి సల్మాన్ ఖాన్.. లారెన్స్ బిష్ణోయ్ గాంగ్ టార్గెట్ జాబితాలో టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఈ గ్యాంగ్ నుంచి సల్మాన్ అనేక సార్లు హత్య బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మోటారు బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సల్మాన్ ఇంటి ముందు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే జూన్లో మరోసారి సల్మాన్ హత్యకు కుట్ర జరిగింది. పన్వేల్ ఫామ్హౌస్ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో సల్మాన్పై దాడి చేయాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులోనే తాజాగా అరెస్ట్ జరిగింది.
ఇక ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తోందని పోలీసులు ఛార్జిషీట్లో ప్రస్తావించారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తరహాలోనే కారులో సల్మాన్ను హత్య చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు గుర్తించారు. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు.
నటుడి హత్యకు మోడ్రన్ వెపన్స్ కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే నిందితుల ముఠా ఏకే-47, ఎం16, ఏకే-92 తుపాకులు, హై-కాలిబర్ ఆయుధాలను వంటి అధునాతన మారణాయుధాలను పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. సల్మాన్ హత్య కుట్రలో భాగంగా సల్మాన్ ఫామ్హౌస్ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్ ప్రదేశాల్లో బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ.. నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది.