చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేత, మాజీ సీఎం సుక్భీర్ సింగ్ బాదల్ బావమరిది విక్రం మజిధియాపై పంజాబ్ పోలీసులు డ్రగ్స్ కేసు నమోదు చేశారు. మజిధియా డ్రగ్స్ అక్రమ రవాణా, డ్రగ్స్ పంపిణీ, విక్రయాలకు సహకారం అందించడమే కాకుండా డ్రగ్స్ స్మగ్లింగ్కు నేరపూరిత కుట్ర పన్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మజిధియాపై డ్రగ్స్ కేసు నమోదైందని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు.
డ్రగ్స్ మాఫియాపై చర్యలకు తాను నాలుగేండ్ల కిందటే పట్టుబట్టానని, తాజా పరిణామం పంజాబ్ను కుదిపేసిన అంశాలపై ఏండ్లతరబడి ఉదాసీనంగా వ్యవహరించిన వారికి చెంపపెట్టని సిద్ధూ వ్యాఖ్యానించారు. బాదల్ కుటుంబ అవినీతిపై ఐదున్నరేండ్ల పోరాటం తర్వాత.. మజిధియాకు వ్యతిరేకంగా ఈడీ, ఎస్టీఎఫ్ ఇచ్చిన నివేదికలపై కెప్టెన్ సింగ్ ప్రభుత్వం నాలుగేండ్ల పాటు నాన్చిన అనంతరం విశ్వసనీయతకు మారుపేరైన అధికారులు తీసుకున్న తొలి చర్య ఇదేనని సిద్ధూ చెప్పుకొచ్చారు. డ్రగ్ మాఫియా వ్యతిరేక పోరాటంలో ఎఫ్ఐఆర్ తొలి అడుగు మాత్రమేనని డ్రగ్ మాఫియా వెనక ప్రధాన నిందితులకు కఠిన శిక్ష విధించినప్పుడే న్యాయం జరుగుతుందని అన్నారు.