చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ను ఆ పదవి నుంచి తొలగించాలని శిరోమణి అకాలీదళ్ డిమాండ్ చేసింది. ఆ రాష్ట్ర గవర్నర్ను కలిసిన ఆ పార్టీ బృందం ఈ మేరకు వినతి పత్రం సమర్పించింది. పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలాపై కాల్పులు జరిపిన దుండగులు ఆదివారం ఆయనను హత్య చేశారు. ఈ ఘటనను పంజాబ్ కాంగ్రెస్తోపాటు ఆ రాష్ట్రానికి చెందిన శిరోమణి అకాలీదళ్ ఖండించింది. ఆ పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ను సోమవారం కలిసింది. భగవంత్ మాన్ సింగ్ను సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. సింగర్ సిద్ధూ హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని కోరింది. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని ఆయనకు సమర్పించింది.
కాగా, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ అనంతరం ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. సిద్ధూ మూసేవాలా హత్యకు సీఎం భగవంత్ మాన్ సింగ్ బాధ్యుడని ఆరోపించారు. ప్రతిజ్ఞను ఉల్లంఘించి, సిద్ధూ భద్రత ఉపసంహరణకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఆప్ ట్విట్టర్లలో లీక్ చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం పదవిలో కొనసాగే అర్హత ఆయనకు లేదని విమర్శించారు.