చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ పంజాబ్లో రాజకీయ వేడి రగులుతున్నది. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్ పార్టీ ప్రచారం కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎప్పుడూ బీజేపీతో కలిసి కూటమిగా బరిలో దిగే శిరోమణి అకాలీదళ్ పార్టీ ఈసారి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాది పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలో శిరోమణి అకాలీదళ్ను స్థాపించి వందేండ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ మోగాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఆ సభలో ప్రసంగించిన శిరోమణి అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్.. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో చుతుర్ముఖ పోటీ ఉంటుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మూడు వేర్వేరు కూటములుగా బరిలో దిగనున్నాయని, తాము కూడా బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నామని ఆయన తెలిపారు. శిరోమణి-బీఎస్పీ పార్టీలే మీ సొంత పార్టీలని, శిరోమణి అకాలీదళ్ లాగానే బీఎస్పీ కూడా పంజాబ్లోనే పుట్టిందని పంజాబీలను ఉద్దేశించి బాదల్ చెప్పారు. శిరోమణి-బీఎస్పీ పార్టీలకు మాత్రమే మీ సమస్యలు తెలుస్తాయని, ఆ రెండు పార్టీలే మీ కోసం పోరాడుతాయని అన్నారు.
వివాదాస్పద వ్యవసాయ చట్టాలు చేసిన బీజేపీ మీ కోసం పోరాడుతుందా..? అని సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రశ్నించారు. ఢిల్లీ గురుద్వారా ప్రంబంధక్ కమిటీ ఎన్నికల్లో శిరోమణి విజయం సాధించిందని, అయినా శిరోమణి పార్టీ అధ్యక్షుడిని నియమించకుండా బీజేపీ అడ్డుకుంటున్నదని ఆయన ఆరోపించారు. ఎందుకంటే బీజేపీ వారి మనిషిని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టి, శిరోమణిని బలహీనపర్చాలని చూస్తున్నదని విమర్శించారు.