”వీలైనంత తొందరగా నన్ను సీఎం చేయండి. ఆలస్యం వద్దు. మరో యేడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. రాజస్థాన్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే నన్ను సీఎం చేయాలి. ఒకవేళ అలా చేయమని పక్షంలో… పంజాబ్ లాగే మనం ఓడిపోతాం జాగ్రత్త..” కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాజస్థాన్ యువనేత సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలివి. తనను సీఎం చేయకుంటే.. రాజస్థాన్లో అధికారం కోల్పోవడం ఖాయం అని పైలట్ ధమ్కీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.
కొన్ని వారంలోనే పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్, ప్రియాంకతో సచిన్ పైలట్ భేటీ అయ్యారు. ఒక్క వారంలోనే ఏకంగా మూడు సార్లు భేటీ అయ్యారు. ఈ మూడు మార్లూ తనన సీఎం చేయాలన్న డిమాండ్నే అధిష్ఠానం ముందు ఉంచినట్లు ఆయన వర్గీయులు పేర్కొన్నారు.
కొన్ని రోజులుగా రాజస్థాన్ సీఎం గెహ్లోత్, సచిన్ పైలట్ మధ్య బహిరంగంగానే మాటల యుద్ధం సాగింది. ఆ తర్వాత అధిష్ఠానం రంగంలోకి దిగడంతో కాస్త సర్దుబాటైంది. ఆ తర్వాత సచిన్ పైలట్కు జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పజెబుతామని అధిష్ఠానం ఎంత మొత్తుకున్నా… పైలట్ మాత్రం వినలేదు. తనకు సీఎం పోస్టే కావాలని పట్టుబట్టారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ… కొన్ని రోజుల క్రితం సచిన్ పైలట్ సోనియా, ప్రియాంక, రాహుల్తో భేటీ అయిన తర్వాత మళ్లీ పైలట్ తెరపైకి వచ్చారు.