న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై చేసిన రావణ్ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. ఖర్గే వ్యాఖ్యలను గుజరాత్ ఎన్నికల అంశంగా మార్చేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గుజరాత్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో నరేంద్ర మోదీని ఖర్గే రావణుడితో పోల్చిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
వాస్తవ అంశాలను మరుగునపరిచేందుకు బీజేపీ ఖర్గే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు అర్రులు చాస్తోందని ఓ వార్తా సంస్ధతో మాట్లాడుతూ సచిన్ పైలట్ పేర్కొన్నారు. గుజరాత్లో బీజేపీకి ఈసారి కాంగ్రెస్ దీటైన సవాల్ విసిరిందని, క్షేత్రస్థాయిలో క్యాడర్తో పాటు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంక్ చెక్కుచెదరలేదని చెప్పారు. గుజరాత్లో కాషాయ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ విస్పష్ట మెజారిటీతో అధికారంలోకి వస్తుందనే భయంతో బీజేపీ సున్నిత అంశాలను లేవనెత్తి భావోద్వేగాలను రెచ్చగొడుతున్నదని ఆరోపించారు. మోదీ సర్కార్ ధరలను అదుపు చేయడంలో, రూపాయి పతనాన్ని అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రాజస్ధాన్ సీఎం అశోక్ గహ్లాట్తో తనకు విభేదాలు లేవని తామంతా కలిసి రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను విజయవంతం చేస్తామని చెప్పారు.