జైపూర్: రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలు రేపిన రాజకీయ సంక్షోభం ముదురుపాకాన పడింది. సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత సచిన్ పైలట్ వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ పరిణామాలపై సచిన్ పైలట్ కాంగ్రెస్ హైకమాండ్తో మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం.
అశోక్ గెహ్లాట్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీపడాలని నిర్ణయించుకుంటే ఇంకా సీఎంగా కొనసాగడం కరెక్ట్ కాదని సచిన్ పైలట్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చెప్పినట్లు తెలిసింది. అదేవిధంగా తనకు సీఎం పదవి ఇవ్వకూడదంటూ గోల చేస్తున్న గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలను అదుపు చేయాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉందని పైలట్ అధిష్ఠానానికి స్పష్టంచేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి గాంధీల కుటుంబానికి నమ్మకస్తుడైన అశోక్ గెహ్లాట్ను అభ్యర్థిగా నిలబెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. అశోక్ గెహ్లాట్ కూడా అందుకు సమ్మతించడంతో అధిష్ఠానం రాజస్థాన్ తదుపరి సీఎంగా సచిన్ పైలట్ పేరును ఖరారు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సచిన్ పైలట్కు సీఎం పదవి ఇవ్వొద్దంటూ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు పట్టుబట్టడం రాజకీయ అస్థిరతకు దారితీసింది.