జైపూర్ : కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తనతో ఫోన్ లో మాట్లాడుతూ కాషాయ పార్టీలో చేరేందుకు అంగీకరించారని బీజేపీ నేత రీటా బహుగుణ జోషీ పేర్కొనడాన్ని ఆయన తోసిపుచ్చారు. రీటా బహుగుణ జోషీ సచిన్ తో మాట్లాడానని చెబుతున్నారు. ఆమె సచిన్ టెండూల్కర్ తో మాట్లాడి ఉంటారు..ఆమెకు నాతో మాట్లాడే ధైర్యం లేదని పైలట్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పట్ల సచిన్ పైలట్ అసమ్మతితో రగులుతున్నారని, బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. యూపీ కాంగ్రెస్ లో కీలక నేత జితిన్ ప్రసాద బీజేపీలో చేరడంతో సచిన్ పైలట్ సైతం కాషాయ పార్టీకి దగ్గరవుతారని ప్రచారం ఊపందుకుంది. మధ్యప్రదేశ్ లోనూ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ పంచన చేరడంతో అక్కడ కమల్ నాథ్ సర్కార్ కుప్పకూలి శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో కాషాయ ప్రభుత్వం కొలువుతీరింది.