డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో సీఎంను మార్చినంత మాత్రాన బీజేపీ చేసిన పాపాలు మాసిపోవని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ తమ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పైలట్ మంగళవారం హరిద్వార్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేర్కొన్నారు.
కాగా ఉత్తరాఖండ్ లో ఇటీవల తివేంద్ర రావత్ రాజీనామా చేయడంతో ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తిరత్ సింగ్ రావత్ పాలనా పగ్గాలు చేపట్టారు. మరోవైపు యూపీలో కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద పార్టీని వీడటంతో యువనేత సచిన్ పైలట్ కూడా పార్టీని వీడతారని ప్రచారం సాగిన నేపథ్యంలో పైలట్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుండటం గమనార్హం.