న్యూఢిల్లీ: భారత్, రష్యా స్నేహబంధం మరింత బలపడనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir putin) భారత్లో పర్యటించనున్నారు. వార్షిక సదస్సులో భాగంగా సోమవారం ఢిల్లీకి రానున్నారు. రేపు సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని మోదీతో పుతిన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నది.
భారత్, రష్యా మధ్య రక్షణ రంగంలో చిరకాల సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 200 హెలికాప్టర్ల తయారీపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అదేవిధంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పలు అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రాత్రి 9.30 గంటలకు పుతిన్ రష్యాకు తిరుగు పయనమవుతారు. కాగా, పుతిన్ గౌరవార్థం మోదీ విందు ఇవ్వనున్నారు.
భారత్-రష్యా మధ్య ఇప్పటికే 20 సార్లు వార్షిక సదస్సులు జరిగాయి. ప్రస్తుతం జరగనున్నది 21వది. సాధారణంగా ఈ వార్షిక సదస్సు ఒకసారి రష్యాలో జరిగితే మరోసారి భారత్లో జరగడం ఆనవాయితీగా వస్తున్నది. గతేడాది భారత్లో జరగాల్సిన ఈ సదస్సు.. కరోనా కారణంగా వాయిదాపడింది.
అయితే ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గడంతో వార్షిక సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు భారత్కు వస్తున్నారు. కాగా, రష్యా నుంచి ఆధునిక ఏకే-203 తుపాకుల అత్యవసర కొనుగోలుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.