మాస్కో : ఉక్రెయిన్ ఖార్కివ్లో భారత విద్యార్థి మృతిపై రష్యా విచారణ జరుపుతుందని రష్యా రాయబారిగా నియామకమైన డెనిస్ అలిపోవ్ బుధవారం తెలిపారు. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో నాల్గో సంవత్సరం చదువుతున్న నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ మంగళవారం రష్యా జరిపిన దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
సంఘటన అనంతరం ఖార్కివ్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న భారతీయ పౌరులకు ‘అత్యవసరంగా సురక్షితమైన మార్గం’ ఉండేలా చూడాలని రష్యా, ఉక్రెయిన్ రాయబారులను భారత్ కోరింది. ఈ దుర్ఘటనపై నవీన్ కుటుంబానికి, యావత్ భారతదేశానికి సానుభూతిని తెలియజేస్తున్నట్లు రాయబారి అలిపోవ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తీవ్రమైన ఘర్షణ ప్రాంతాల్లోనూ భారత పౌరుల భద్రతకు భరోసా ఇచ్చేందుకు రష్యా చేయగలిగినదంతా చేస్తుందన్నారు.
ఇదిలా ఉండగా.. నవీన్ స్వస్థలం కర్నాటకలోని హవేరి జిల్లా చలగేరి. అయితే, నవీన్ మృతదేహాన్ని గుర్తించి యూనివర్సిటీలోని మార్చురీకి తరలించామని, తిరిగి భారత్కు తీసుకువచ్చేందుకు అధికారులు ఖార్కివ్లో స్థానిక పరిపాలనతో సంప్రదింపులు జరుపుతున్నారని విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా చెప్పారు.