న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో వృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని, కొవిడ్ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకొంటున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనికి డిమాండ్ తగ్గిందని కేంద్రం ఈ ఏడాది జనవరి 31న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో పేర్కొన్నది. ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులను భారీగా తగ్గించింది. అయితే కేంద్రం చెబుతున్న దానికి, ఉపాధి డిమాండ్కు సంబంధించిన తాజా అధికారిక గణాంకాలు విరుద్ధంగా ఉన్నాయి. ఈ పథకం కింద పని కోరుతున్న కుటుంబాల సంఖ్య భారీగా ఉన్నది. పని డిమాండ్ చేస్తున్న కుటుంబాల సంఖ్య ఏప్రిల్లో 2.4 కోట్లు, మే నెలలో 3.17 కోట్లుగా ఉన్నది. కొవిడ్ ఏడాదిని మినహాయిస్తే ఇది గత ఐదేండ్లలోనే అధికం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేమి గణాంకాలు కనిపించడం లేదా? అని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ ట్విట్టర్లో ప్రశ్నించారు.