AAP | పంజాబ్ ఆమ్ఆద్మీ పార్టీలో ఒక్కసారిగా విభేదాలు పొడసూపాయి. అంత సవ్యంగానే నడుస్తుందనుకుంటున్న సమయంలో టిక్కెట్ల విషయంలో విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం ఆప్ సీనియర్ నేత, పంజాబ్ ఎన్నికల కో ఇన్ఛార్జీ రాఘవ్ చద్దా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే టిక్కెట్ల విషయంలో తీవ్ర అసంతృప్తికి లోనైన నేతలు మీడియా సమావేశంలో ఒక్కసారిగా రెచ్చిపోయారు. రాఘవ్ చద్దాను ఘెరావ్ చేశారు.
అదే ప్రెస్ క్లబ్లో ఆమ్ఆద్మీ నేతలు ఒకరిపై ఒకరు ముష్ఠి ఘాతాలకు దిగారు. దీంతో అక్కడ రణరంగంగా మారిపోయింది. ఆప్ సీనియర్ నేతలైన శివదయాల్ మాలీ, సంజీవ్ శర్మ, జోగిందర్ పాల్ శర్మ మద్దతు దారులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకున్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి ఆప్లో చేరిన వారికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందని, వారినే అక్కున చేర్చుకుంటున్నారని ఈ వర్గీయులు రాఘవ్ చద్దాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.