ముంబై: ఆర్ఎస్ఎస్ ఆసుపత్రి హిందువులకేనా? అని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. అయితే మతం ఆధారంగా ఆర్ఎస్ఎస్ వివక్ష చూపదని తాను చెప్పానని ఆయన అన్నారు. మహారాష్ట్ర పూణేలోని సింహగడ్ ప్రాంతంలో స్వచ్ఛంద ఆసుపత్రిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గతంలో రతన్ టాటా, ఆయనకు మధ్య జరిగిన ఒక సంభాషణను గుర్తు చేశారు. శివసేన- బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఔరంగాబాద్లో దివంగత ఆర్ఎస్ఎస్ చీఫ్ కేబీ హెడ్గేవార్ ఆసుపత్రిని రతన్ టాటాతో కలిసి ప్రారంభించానని నితిన్ గడ్కరీ తెలిపారు. ఆర్ఎస్ఎస్కు చెందిన ఈ ఆసుపత్రి కేవలం హిందువులకేనా అని ఈ సందర్భంగా ఆయన తనను అడిగారన్నారు.
అయితే మీరు ఎందుకు అలా అనుకున్నారు అని తాను అడిగినట్లు నితిన్ గడ్కరీ చెప్పారు. ఆర్ఎస్ఎస్కు చెందినది కావడంతో తనకు ఆ సందేహం కలిగిందని రతన్ టాటా వెంటనే బదులిచ్చారని అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ ఆసుపత్రి అన్ని వర్గాల కోసమని, ఆర్ఎస్ఎస్లో ఎలాంటి వివక్షలు ఉండవని తాను చెప్పానన్నారు. దీని గురించి మరింతగా వివరించడంతో రతన్ టాటా చాలా సంతోషించారని నితిన్ గడ్కరీ గుర్తు చేసుకున్నారు.