శ్రీనగర్: ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ పార్టీల పేరుతో హిందుత్వాన్ని, హిందూమతాన్ని హైజాక్ చేశాయని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలు జరుగాలని కోరుకునే ఈ పార్టీలను ఐఎస్ఐఎస్, మతం పేరుతో ప్రజలను చంపే ఇతర ఉగ్రవాద సంస్థలతో పోల్చవచ్చని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అయోధ్య తీర్పుపై రాసిన పుస్తకంలో హిందూయిజాన్ని ఉగ్రవాదం, ఐఎస్ఎస్తో పోల్చడంపై వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం శ్రీనగర్లో మీడియాతో ఆమె మాట్లాడారు.
ప్రజలందరినీ కలుపుకొని పోవాలని బోధించే సనాతన ధర్మానికి బీజేపీ విరుద్ధమని ముఫ్తీ విమర్శించారు. బీజేపీ, దాని సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తున్నది సనాతన ధర్మం ఎంత మాత్రం కాదన్నారు. ‘సనాతన ధర్మం మనకు మతతత్వాన్ని బోధించదు. మతతత్వం పేరుతో ప్రజలను పోరాడేలా చేయాలనుకుంటున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ, జన్సంఘ్ సనాతన ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. హిందూమతాన్ని, హిందుత్వాన్ని వారు హైజాక్ చేశారు. హిందుత్వం, హిందూయిజం తమవిగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావిస్తున్నాయి. కానీ అది వాస్తవం కాదు’ అని అన్నారు.
మతం పేరుతో హత్యలు చేసేవాళ్లకు, మతం పేరుతో ఇతర మతం వారిని కొట్టి చంపే వాళ్లకు తేడా ఏమున్నదని ముఫ్తీ ప్రశ్నించారు. ఇలాంటి ‘కమ్యూనల్ పార్టీలను IS (ఇస్లామిక్ స్టేట్)తో పోల్చవచ్చు. హిందువులు, ముస్లింలు మతం పేరుతో కొట్లాడుకునేలా చేసేవారిని ఐఎస్ లేదా మరేదైనా పార్టీతో పోల్చవచ్చు. ఎందుకంటే వారిద్దరూ మతం పేరుతో ప్రజలను చంపుతారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.