న్యూఢిల్లీ : దేశంలో 80 శాతం పైగా ప్రజలు నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వచ్చి (వాక్ ఇన్) వ్యాక్సిన్ వేయించుకున్నారని కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా సాగుతోందని కొవిన్ చీఫ్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. కొవిన్ యాప్ లో సెర్చ్, ఓటీపీ జనరేషన్ కు పరిమితులు విధించడంపై ఆయన స్పందిస్తూ ఈ పోర్టల్ ను పెద్ద సంఖ్యలో యూజర్లు ఉపయోగిస్తుండటంతో వారికి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా లోటుపాట్లను నివారించేందుకే ఈ చర్యలు చేపట్టామని చెప్పారు.
కొవిన్ తో ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు పాలుపంచుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నూ కలిపేలా చూస్తామని తెలిపారు. ఇక కొవిన్ యాప్ పై డేటా లీక్స్ వార్తల గురించి అడగ్గా ఇది తప్పుడు ప్రచారమని దర్యాప్తులో తేలిందని కొవిన్ చీఫ్ ఆర్ఎస్ శర్మ స్పష్టం చేశారు.