లక్నో: స్వీపర్ ఉద్యోగం చేసిన ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ కూడా జీతం డబ్బులను బ్యాంక్ నుంచి తీసుకోలేదు. తన అవసరాల కోసం భిక్షాటన చేసిన అతడు బ్యాంకులో ఏకంగా రూ.70 లక్షలు దాచాడు. అయితే అనూహ్యంగా ఆదివారం తెల్లవారుజామున మరణించాడు. ఉత్తరప్రదేశ్ ప్రయోగరాజ్కు చెందిన ధీరజ్ గతంలో కూడా వార్తల్లో నిలిచాడు. కుష్టు వ్యాధి ఆసుపత్రిలో స్వీపర్గా పని చేసిన తండ్రి మరణాంతరం ఆ ఉద్యోగం పొందాడు.
కాగా, తండ్రి మాదిరిగానే ధీరజ్ కూడా జీతం డబ్బులను బ్యాంకు ఖాతా నుంచి ఎప్పుడూ తీయలేదు. అలాగే తండ్రి మాదిరిగానే అతడు కూడా రోడ్డుపై భిక్షాటన చేసి జీవించాడు. 80 ఏళ్ల తల్లికి వచ్చే పెన్షన్ డబ్బులతో వారిద్దరూ ఇల్లు గడిపేవారు. దీంతో గత పదేళ్లుగా జీతం డబ్బులను బ్యాంకు ఖాతా నుంచి తీయకపోవడంతో అవి లక్షలకు చేరాయి. కొన్ని నెలల కిందట ఐటీ అధికారులు కూడా బ్యాంకు ఖాతాలోని డబ్బులపై ధీరజ్ను ఆరా తీశారు. అయితే అతడు చెప్పిన సమాధానంతో వారు సంతృప్తి చెందారు.
మరోవైపు తన వద్ద ఉన్న డబ్బులు తీసుకుని పారిపోతుందన్న ఉద్దేశంతో ధీరజ్ పెళ్లి కూడా చేసుకోలేదు. తండ్రి మరణాంతరం తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున అతడు మరణించాడు. ధీరజ్ చనిపోయాక బ్యాంకు ఖాతాలో రూ.70 లక్షలు ఉన్నట్లు తెలిసిందని అతడి స్నేహితుడు తెలిపాడు. జీవితాంతం భిక్షాటనతో జీవించిన ధీరజ్, ప్రతి ఏటా ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేసేవాడని మీడియాకు వెల్లడించాడు.