న్యూఢిల్లీ: బంగారం, విదేశీ కరెన్సీ అక్రమ రవాణాలో స్మగ్లర్లు ఆరితేరుతున్నారు. అధికారులు ఎంతమందిని పట్టివేసినా కొత్తగా స్మగ్లింగ్కు పాల్పడేవాళ్లు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఓ ప్యాసింజర్ లంగా గుండీల్లో రూ.41 లక్షల విలువచేసే విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మీసమ్ రజా అనే ప్రయాణికుడు స్పైస్ జెట్ విమానంలో దుబాయ్కి వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్పోర్టుకు వచ్చాడు. అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు, ఎయిర్పోర్టు ఇంటెలిజెన్స్ అధికారులు రజా ప్రవర్తిస్తున్న తీరును అనుమానించారు. అతని లగేజీని ఎక్స్రే బ్యాగేజ్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేయగా లంగా గుండీల్లో విదేశీ కరెన్సీ పట్టుబడింది.
ఆ కరెన్సీని వెలికి తీసి లెక్కించగా 1,85,500 సౌదీ రియాల్స్ ఉన్నాయి. వాటి విలువ మన ఇండియన్స్ కరెన్సీలో రూ.41 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ కరెన్సీకి సంబంధించి ప్రయాణికుడు ఎలాంటి ఆధారాలను చూపించకపోవడంతో ఎయిర్పోర్టు సిబ్బంది అతడిని, కరెన్సీని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.