లక్నో : నిన్న మొన్నటి వరకూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆకాశానికి ఎత్తిన ఆర్పీఎన్ సింగ్ యూపీ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ జాబితాలోనూ చోటుదక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా రాజీనామా చేసిన సింగ్ మరుక్షణంలో కాషాయ గూటిలో ప్రత్యక్షమయ్యారు. కండువా మార్చిన కొద్దిసేపటికే ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ సారధ్యంలోనే దేశాభివృద్ధి సాధ్యమని తేల్చేశారు. తనను బీజేపీలో చేరాలని ప్రజలు ఎప్పటినుంచో కోరుతుంటే ఇప్పటికి సాధ్యపడిందని చెప్పుకొచ్చారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సమక్షంలో ఆర్పీఎన్ సింగ్ కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. 32 ఏండ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, ఆ పార్టీ ఇప్పుడు మునుపటిలా లేదని, అప్పటి ఆలోచనా విధానం కూడా ఇప్పుడు లోపించిందని సింగ్ వ్యాఖ్యానించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. యూపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అభివృద్ధి వేగం పుంజుకుందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని యోగి సర్కార్పై ప్రశంసలు గుప్పించారు.
ఇక ఆర్పీఎన్ సింగ్తో పాటు యూపీ కాంగ్రెస్ ప్రతినిధి శశి వాలియా, పార్టీ కార్యదర్శి రాజేంద్ర ఆహ్వాన కూడా బీజేపీలో చేరారు. సింగ్ బీజేపీలో చేరికను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతించారు. పార్టీలో చేరాలని ఆయనను తాను చాలాకాలం నుంచి కోరుతున్నానని చెప్పారు. మోదీ నాయకత్వాన్ని అంగీకరిస్తూ సింగ్ కాషాయ పార్టీలో చేరడం సంతోషకరమని అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడటం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.