ఆగ్రా, జూలై 13 : ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అమృత్సర్-విశాఖపట్నం హీరాకుడ్ ఎక్స్ప్రెస్ రైలు బయల్దేరుతుండగా..ప్రమాదకరంగా రైలు ఎక్కబోతున్న ఒక మహిళా ప్రయాణికురాలిని రక్షించేందుకు డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ వెంటనే స్పందించారు. వాకీటాకీ ద్వారా సమాచారమిచ్చి రైలును వెంటనే ఆపేయించారు. ఈ ఘటన అక్కడి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్కు మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.
డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ అసలు విషయం వివరించే ప్రయత్నం చేసినా ఆర్పీఎఫ్ సిబ్బంది వినిపించుకోకుండా, ఆయనతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వివాదం ముదరటంతో నలుగురు ఆర్పీఎఫ్ పోలీసులు ప్రయాణికులందరూ చూస్తుండగానే సదరు అధికారి చేతులు, కాళ్లు పట్టుకొని దారుణంగా ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్మీడియాలో సంచలనంగా మారాయి. రైల్వే ఆపరేటింగ్ సిబ్బంది తీవ్ర నిరసనలకు దిగడంతో ఈ ఉదంతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై నార్త్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శివమ్ శర్మ స్పందిస్తూ, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అధికారిపై దాడికి పాల్పడిన ఐదుగురు ఏఎస్ఐలను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఘటనపై లోతైన దర్యాప్తునకు ఆదేశించారు.