ముంబై : జైపూర్-ముంబై రైలులో ఇవాళ నలుగురు వ్యక్తుల్ని ఆర్పీఎప్ కానిస్టేబుల్(RPF Constable) కాల్చి చంపిన ఘటన తెలిసిందే. కానిస్టేబుల్ చేతన్ సింగ్ గురించి రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఐజీ ప్రవీణ్ సిన్హా మీడియాతో మాట్లాడారు. ఆ కానిస్టేబుల్కు షార్ట్ టెంపర్ ఎక్కువ అని తెలిపారు. చేతన్ తలతిక్త వ్యక్తి అని, ఎటువంటి ఘర్షణ లేకుండానే అతను కాల్పులకు తెగబడ్డాడని, సహనాన్ని కోల్పోయిన అతను, సీనియర్ను కాల్చి చంపినట్లు ఐజీ ప్రవీణ్ వెల్లడించారు. కనిపించిన వ్యక్తినల్లా కాల్చేశాడని తెలిపారు.
తన వద్ద ఉన్న గన్తో కానిస్టేబుల్ చేతన్ సీనియర్ టికారామ్ మీనాను షూట్ చేశాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న మరో ముగ్గుర్ని కూడా కాల్చాడు. ఈ ఘటన పాల్గర్ స్టేషన్ వద్ద జరిగింది. మరో స్టేషన్ దిగి పారిపోతుంటే అతన్ని పట్టుకున్నారు. చేతన్ సింగ్ స్వగ్రామం యూపీలోని హత్రాస్. ఏఎస్ఐ మీనాది రాజస్థాన్లోని సవాయి మాదోపుర్. 2025లో మీనా రిటైర్ కావాల్సి ఉంది. ఆయనకు భార్య, తల్లి ఉన్నారు. అయితే ప్రభుత్వం 25 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. కాల్పుల బాధితులందరికీ పరిహారాన్ని ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
ఎస్కార్ట్ డ్యూటీలో భాగంగా గుజరాత్లోని సూరత్ లో సింగ్, మీనాలు రైలు ఎక్కారు. సాధారణంగా సుదీర్ఘ దూరం ప్రయాణించే రైళ్లలో సెక్యూర్టీ కోసం ఎస్కార్ట్ పార్టీలు ఉంటాయి. అయితే ఆ రైలులోనే డ్యూటీలో ఉన్న మరో ఇద్దరు ఆర్పీఎఫ్ పోలీసుల్ని దర్యాప్తులో భాగంగా ప్రశ్నిస్తున్నారు.