న్యూఢిల్లీ : అగ్నిపథ్ స్కీమ్పై మరో వివాదం రాజుకుంది. అగ్నివీర్ రిక్రూట్మెంట్లో భాగంగా అభ్యర్ధుల కులం, మతం సర్టిఫికెట్లను అడుగుతున్నారని బీజేపీ అగ్నివీరుల పేరుతో జాతివీరులను తయారుచేయాలని ప్రయత్నిస్తోందని విపక్షం భగ్గుమంది. అగ్నివీరుల పేరుతో జాతివీరులను తయారుచేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది.
అగ్నివీరుల నియామకాల్లో కుల వివక్ష చూపేందుకు ఆరెస్సెస్ కుట్రకు తెరలేపిందని ఆర్జేడీ విమర్శించింది. మరోవైపు విప్క్షాల విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న నిబంధనని, హైరింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేపట్టలేదని పేర్కొంది. ఎంపిక ప్రక్రియలో కులం పాత్ర ఉండదని, అయితే కార్యనిర్వహణ అవసరాల కోసం దరఖాస్తులో మాత్రం కులం కాలమ్ను భర్తీ చేయాల్సి ఉంటుందని 2013లో భారత సైన్యం సర్వోన్నత న్యాయస్ధానంలో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొందని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర స్పష్టం చేశారు.
మరోవైపు అగ్నివీరుల నియామకం కోసం నియామక పాలసీలో ఎలాంటి మార్పు లేదని ఆర్మీ వివరణ ఇచ్చింది. దరఖాస్తుల్లో కులం, మతం కాలమ్లు ఎప్పటి నుంచో ఉన్నాయని తెలిపింది. క్యాస్ట్ సర్టిఫికెట్లను అభ్యర్ధులు నిబంధనల ప్రకారం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. రెలిజియన్ సర్టిఫికెట్లు కూడా నియామక నిబంధనల ప్రకారం అవసరమని పేర్కొంది.