న్యూఢిల్లీ: రోహిణి నిలేకని(Rohini Nilekani) ఓ గొప్ప దాత. మహాదాతృత్వానికి ఆమె నిదర్శనం. ఈ ఏడాది ఆమె ఇప్పటి వరకు 170 కోట్లు విరాళాల రూపంలో ఇచ్చేసింది. దీంతో హురన్ దాతల టాప్ లిస్టులో ఆమె చోటు సంపాదించుకున్నది. ఇక ఆమె భర్త నందన్ నిలేకని ఈ ఏడాది 189 కోట్లు డొనేట్ చేసి ఆ జాబితాలో స్థానం సంపాదించాడు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడే నందన్ నిలేకని. అయితే హురన్ లిస్టులో రోహిణి పదవ స్థానంలో ఉన్నారు. ఇక నందన్ 8వ స్థానంలో నిలిచారు. హురన్ దాతల జాబితాలో హెచ్సీఎల్ సహ వ్యస్థాపకుడు శివ నాడర్ మొదటిస్థానంలో నిలిచారు. నిలేకని దంపతులు తమ దాతృత్వ గుణానికి కట్టుబడి ఉన్నారని హురన్ ఇండియా పేర్కొన్నది.
1960లో రోహిణి నిలేకని జన్మించారు. ఆర్ఘ్యం ఫౌండేషన్ను ఆమె స్థాపించారు. నీరు, పారిశుద్ధ్యం అంశాలపై ఆ సంస్థ పనిచేస్తుంది. రోహిణి నిలేకని ఫిలాంత్రోఫీకి చైర్పర్సన్గా ఉన్నారు. ఇల్ఫిన్స్టోన్ కాలేజీలో రోహిణి ఫ్రెంచ్ సాహిత్యం నేర్చుకున్నారు. 1980లో ఆమె బాంబే మ్యాగ్జిన్కు రిపోర్టర్గా చేశారు. బెంగుళూరులో సండే మ్యాగ్జిన్కు కూడా చేశారు.
రోహిణి నిలేకని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఓ ఇంజినీరు, ఆమె తల్లి ఓ గృహిణి. 1977లో రోహిణి, నందన్ మధ్య పరిచయమైంది. 1981లో ఇన్ఫోసిస్ను స్థాపించిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు జాహ్నవి, నిహార్. ఏక్స్టెప్, ప్రథమ్ బుక్స్ అనే నాన్ప్రాఫిట్ ఎడ్యుకేషనల్ ఫ్లాట్ఫామ్లను ఈ ఇద్దరూ ప్రారంభించారు. చిన్నపిల్లల కోసం ఈ సంస్థ పుస్తకాలను ప్రచురిస్తుంది. బిల్ గేట్స్, వారెన్ బఫెట్ సంయుక్తంగా స్థాపించిన గీవింగ్ ప్లెడ్ ఛారిటీ సంస్థతో నిలేకని దంపతులు సంతకం చేశారు. తమ సంపదలో 50 శాతం దానం చేయడానికి ఆ ఒప్పందం ప్రకారం అంగీకరించారు.