జైపూర్ : రాజస్థాన్ ప్రభుత్వంలో ఇటీవలే కొత్తగా మంత్రి పదవి చేపట్టిన రాజేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని రోడ్లు.. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ చెంపల్లా మెరిసిపోవాలని అధికారులకు సూచించారు. వివరాల్లోకి వెళ్తే.. మంత్రి రాజేంద్ర సింగ్ మంగళవారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఉదయ్పూర్వతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానికులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు వారి సమస్యలను విన్నవిస్తూ.. అధ్వాన్నమైన రోడ్ల పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తక్షణమే మంత్రి రాజేంద్ర సింగ్ స్పందించారు. అక్కడే ఉన్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజినీర్ వైపు మంత్రి రాజేంద్ర చూస్తూ.. తన నియోజకవర్గంలో కత్రినా కైఫ్ చెంపల్లా రోడ్లను నిర్మించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలతో సమావేశంలో నవ్వులు పూశాయి. దీంతో మంత్రి మరోసారి ఈ వ్యాఖ్యలను పునరావృతం చేశారు.
బాలీవుడ్ హీరోయిన్లతో రోడ్లను పోల్చడం కొత్తేం కాదు. 2005లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్.. బీహార్ రోడ్లను హేమమాలిని చెంపల్లా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. 2019లో మధ్యప్రదేశ్ న్యాయ శాఖ మంత్రి పీసీ శర్మ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. డ్రీమ్ గర్ల్ స్టార్ నుష్రత్ చెంపల్లా రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు.