లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్లో ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి ఓటు వేయలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఇది వారి వంశ దురహంకారాన్ని తెలియజేస్తున్నదని ఆరోపించారు. అలాంటి వారికి ప్రజాస్వామ్య శక్తి తగిన సమాధానం ఇస్తుందన్నారు. యూపీలోని బిస్వాన్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమితోపాటు కాంగ్రెస్ పార్టీపై జేపీ నడ్డా మండిపడ్డారు. కేవలం బీజేపీ మాత్రమే జాతీయ పార్టీగా మిగిలి ఉందన్నారు. ఇతర పార్టీలన్నీ రాజవంశాల పార్టీలుగా మారాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయంగా లేదా భారతీయంగా కూడా మిగలలేదని ఎద్దేవా చేశారు. అది ఒక ప్రాంతీయ పార్టీగాను, సోదర సోదరీమణుల పార్టీగా మారిందన్నారు.
ఉత్తరప్రదేశ్ను అల్లర్లు, మాఫియా, తీవ్రవాద రహితంగా ఉంచుతామని జేపీ నడ్డా తెలిపారు. దేవ్బంద్, మీరట్, రాంపూర్, అజంగఢ్, కాన్పూర్, బహ్రైచ్లలో యాంటీ టెర్రరిస్ట్ కమాండో కేంద్రాలు నిర్మిస్తామని చెప్పారు. అఖిలేష్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 200 అల్లర్లు జరిగాయని, యోగి హయాంలో ఎలాంటి అల్లర్లు జరుగలేదన్నారు.