పట్నా : బిహార్లో చిన్నాచితకా బీజేపీ నేతలకు సైతం కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించడం పట్ల బిహార్ అసెంబ్లీలో విపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ విస్మయం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై విశ్వాసం లేనందునే కేంద్రం వారికి వై కేటగిరీ భద్రత కల్పిస్తోందన్నారు.
అగ్నిపథ్కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల నేపధ్యంలో ఈ వారంలో ఏకంగా పది మంది బీజేపీ నేతలకు వై కేటగిరీ భద్రత కల్పించారు.బిహార్లో బీజేపీ నేతలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నారని రాష్ట్రంలో మహా ఆటవిక రాజ్యం సాగుతోందనేందుకు ఉదాహరణని వ్యాఖ్యానించారు. ఈ అవినీతి బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి కేంద్ర బలగాల నుంచి భద్రత పొందుతున్నారని అన్నారు.
తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, పోలీసులపై వీరికి విశ్వాసం లేదని ఎద్దేవా చేశారు. బిహార్లో శాంతి భద్రతల పరిస్ధితి దిగజారిందని అందుకే డిప్యూటీ సీఎం తర్ కిషోర్ ప్రసాద్, రేణు దేవి, రాష్ట్ర బీజేపీ చీఫ్ డాక్టర్ సంజయ్ జైశ్వాల్ సహా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలకు వై కేటగిరీ భద్రత కల్పించారని తేజస్వి యాదవ్ దుయ్యబట్టారు.