న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, ఆ పార్టీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్కు మరోసారి కోపం వచ్చింది. దీంతో పార్టీ సమావేశం మధ్యలో ఆయన వెళ్లి పోయారు. సొంత పార్టీ నేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆర్జేడీ సమావేశం ఆదివారం జరిగింది. ఇందులో పాల్గొన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నట్టుండి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. సొంత పార్టీ నేత, ఆర్జేడీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్యామ్ రజక్పై ఆయన మండిపడ్డారు. ఆయన తనని తిట్టినట్లు ఆరోపించారు. ‘ఈ రోజు నేను మీటింగ్ షెడ్యూల్ గురించి అడిగినప్పుడు శ్యామ్ రజక్ నన్ను, నా వ్యక్తిగత సహాయకుడిని, నా సోదరిని దుర్భాషలాడారు. నా వద్ద ఆడియో రికార్డింగ్ ఉంది. దానిని నా సోషల్ మీడియాలో పెడతాను. అలాంటి బీజేపీ-ఆర్ఎస్ఎస్ వ్యక్తులను పార్టీ నుంచి తరిమికొట్టాలి’ అని మీడియాతో ఆయన అన్నారు.
మరోవైపు దీని గురించి తాను వ్యాఖ్యానించబోనని ఆర్జేడీ నేత శ్యామ్ రజక్ మీడియాకు చెప్పారు. తాను బలహీన వ్యక్తినని, ఒత్తిడి, ఇబ్బందుల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల క్రితమే తన మేనల్లుడు చనిపోయినా పార్టీ కార్యక్రమానికి వచ్చానని అన్నారు. ఈ రోజు జరిగిన దానికి చాలా బాధపడినట్లు చెప్పారు. అయితే పార్టీ సమావేశంలో ఏం జరిగిందో అన్నది వివరించేందుకు ఆయన నిరాకరించారు.