East India company | భారతదేశంలో పోర్చుగీసువారిని అడ్డు తొలగించుకోవడంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించింది. ఇండోనేషియాలో మాత్రం ఇంగ్లండ్పై నెదర్లాండ్స్ ఆధిపత్యం చెలాయించింది. దాంతో ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ పూర్తిగా భారతదేశం మీదనే దృష్టి సారించింది.
తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, భారతదేశంతో వర్తకం కోసం 1600 సంవత్సరంలో ఏర్పాటైన వాణిజ్య సంస్థ ఈస్టిండియా కంపెనీ. 1600 డిసెంబర్ 31న రాయల్ చార్టర్ ద్వారా ఇది ఏర్పాటైంది. ఒక వ్యాపార సంస్థగా భారతదేశానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీ మొగల్ సామ్రాజ్య వైభవం క్షీణిస్తున్న దశలో వ్యాపారం మీద గుత్తాధిపత్యం కోసం దేశ రాజకీయాల్లోనూ తలదూర్చడం మొదలుపెట్టింది. అలా 19వ శతాబ్ది సగంనాటికి భారతదేశం కంపెనీ హస్తగతమైపోయింది.
అయితే, తూర్పు దేశాల సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసమే కంపెనీ ప్రధానంగా ఏర్పాటైందన్నది సత్యం. కానీ, కంపెనీ దేశంలో ప్రవేశించేనాటికి భారతదేశ విదేశీ వర్తకం పోర్చుగీసు వాళ్ల చేతుల్లో ఉండింది. 1588లో పోర్చుగీసు, స్పెయిన్ దేశాల ఉమ్మడి సైన్యాలు ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయాయి. అది భారతదేశంతోపాటు, ప్రపంచంలో వివిధ దేశాల వర్తకం మీద ఇంగ్లండ్ గుత్తాధిపత్యానికి అవకాశం ఇచ్చింది. ఇదే సమయంలో నెదర్లాండ్స్కు చెందిన ‘డచ్ ఈస్టిండియా కంపెనీ’ ఇండోనేషియాలో ఏకస్వామ్యాన్ని సాధించింది. అలా ఇంగ్లండ్కు పోర్చుగీసు, డచ్ రూపంలో వ్యాపార ప్రత్యర్థులు ఎదురయ్యారు.
భారత్లో పోర్చుగీసువారిని అడ్డు తొలగించుకోవడంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించింది. ఇండోనేషియాలో ఇంగ్లండ్పై నెదర్లాండ్స్ ఆధిపత్యం చెలాయించింది. దాంతో ఇంగ్లిష్ కంపెనీ పూర్తిగా భారతదేశం మీదనే దృష్టి సారించింది. పోర్చుగీసులను ఓడించడంతో మొగలులు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి మనదేశంలో వర్తక స్థావరాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. అలా జహంగీర్ చక్రవర్తి హయాంలో.. 1613లో భారతదేశ పశ్చిమ తీరంలోని సూరత్ నగరంలో తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్నారు. పత్తి, పట్టువస్ర్తాలు, నీలిమందు, సూరేకారం, సుగంధ ద్రవ్యాలను ప్రధానంగా భారతదేశం నుంచి ఇంగ్లండ్, ఇతర ఐరోపా దేశాలకు ఎగుమతి చేసేది. ఇంకా పర్షియన్ సింధుశాఖ, ఆగ్నేయ, తూర్పు ఆసియాకు కూడా కార్యకలాపాలను విస్తరించింది.