Onions Price | న్యూఢిల్లీ, అక్టోబర్ 28: దేశంలో ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఉల్లి కనీస ఎగుమతి ధర(ఎంఈపీ)ను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. ఇది ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపింది.
ధరల నియంత్రణతోపాటు దేశీయంగా ఉల్లిగడ్డల అందుబాటును పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది. కాగా, తగిన సరఫరా లేకపోవడంతో దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధర కిలో రూ.65-80 పలుకుతున్నది.