Delhi polls : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఢిల్లీలోని వివిధ నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ తరఫున బరిలో దిగనున్న మొత్తం 15 మంది అభ్యర్థుల జాబితాను ఆర్పీఐ విడుదల చేసింది. న్యూఢిల్లీ నుంచి శుభి సక్సేనా, పాలం నుంచి వీరేందర్ తివారీ, మాలవీయనగర్ నుంచి రాంనరేష్ నిషాద్ బరిలో దిగబోతున్నారు.
కాగా ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం ఈ నెల 10న నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ప్రస్తుతం నామినేషన్ల దాఖలు కొనసాగుతోంది. ఈ నెల 17 వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. ఈ నెల 18న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 20 వరకు గడువు ఉంది.
ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఢిల్లీలో ఈసారి అధికార ఆమ్ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ల నడుమ త్రిముఖ పోరు నెలకొంది. జాతీయంగా ప్రతిపక్ష ఇండియా కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న ఆప్, కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడబోతున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ త్రిముఖపోరే జరిగింది. కానీ కాంగ్రెస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలువలేకపోయింది. 2015లో ఆప్ 67 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా దక్కలేదు. 2020లోనూ ఆప్ 62 స్థానాల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్ పార్టీ మళ్లీ సున్నా స్థానాలకే పరిమితమైంది.