న్యూఢిల్లీ: భారత్, కెనడా (India Vs Canada) మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అమెరికాలో రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో కొన్ని రోజుల కిందట వారిద్దరూ భేటీ అయ్యి సంక్షోభాన్ని నివారించడంపై చర్చించినట్లు బ్రిటన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. అయితే కెనడా లేదా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని ధృవీకరించలేదు.
కాగా, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెన్సీల ప్రమేయం ఉందని కెనడా ఆరోపించింది. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో అన్నారు. అలాగే భారత్ సీనియర్ దౌత్యాధికారిని కెనడా నుంచి పంపివేశారు. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ప్రతిగా కెనడా దౌత్యాధికారిని భారత్ నుంచి బహిష్కరించింది.
మరోవైపు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత దెబ్బతినడంతో కెనడా దౌత్యాధికారుల తరలింపునకు భారత్ ఇటీవల డెడ్లైన్ విధించింది. దీంతో సుమారు 30 మంది కెనడా దౌత్యవేత్తలను భారత్ నుంచి మలేషియా, సింగపూర్కు ఆ దేశం తరలించింది. ఈ పరిణామాల నేపథ్యంలో దౌత్య సంబంధాల పునరుద్ధరణలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అమెరికాలో సమావేశమైనట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసిందని బ్రిటన్ వార్తా పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.