Repolling : పశ్చిమబెంగాల్ (West Bengal) లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఎన్నికల అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. మగ్రాహట్ (West), డైమండ్ హార్బర్ (Dimond Harbour) అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 15 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలని శుక్రవారం ఆదేశించింది. పోలింగ్ రోజున ఈ కేంద్రాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని రిటర్నింగ్ అధికారులు, జనరల్ అబ్జర్వర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీఐ (ECI) ఒక ప్రకటనలో తెలిపింది.
ఏప్రిల్ 29న రెండో దశలో పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో శుక్రవారమే రీపోలింగ్ జరగనుంది. రీపోలింగ్ జరగనున్న 15 బూత్లలో 11 మగ్రాహట్ (West) నియోజకవర్గంలో ఉండగా, మిగిలిన 4 డైమండ్ హార్బర్ పరిధిలో ఉన్నాయి. ఇదిలావుంటే ఇదే జిల్లాలోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా దాదాపు 30 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ జరిగే అవకాశం ఉందని ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయ వర్గాలు సూచిస్తున్నాయి. ఫల్టాలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పేరు, గుర్తు పక్కన ఉన్న ఈవీఎం బటన్ పనిచేయడం లేదని వచ్చిన ఫిర్యాదులపై ఈసీఐ సమగ్ర విచారణకు ఆదేశించింది.
ఈసీ నియమించిన ప్రత్యేక పరిశీలకుడు సుబ్రత్ గుప్తా స్వయంగా గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ జరిపారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన ఫల్టాలోని 30 బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. గతంలో ఫల్టా నియోజకవర్గం మొత్తం రీపోలింగ్ జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఏప్రిల్ 29న పోలింగ్ జరగడానికి ముందు నుంచే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలింగ్ రోజున కూడా అక్కడక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.