ముంబై: రిలయన్స్ కంపెనీ ఇప్పుడు టెక్ గ్యాడ్జెట్ల ఉత్పత్తి మీద దృష్టి సారిస్తోంది. ఇప్పటికే జియో ఫీచర్ ఫోన్స్, ల్యాప్టాప్స్, గేమింగ్ కంట్రోలర్స్ వంటి వాటిని రిలియన్స్ ఆవిష్కరించింది. కాగా ఇటీవల సరికొత్త స్మార్ట్ గ్లాసెస్ను ఉత్పత్తి చేసింది. జియోగ్లాస్ పేరుతో రాబోతున్న ఈ లేటెస్ట్ టెక్ గ్యాడ్జెట్కు సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC)-2023 ఈవెంట్లో కనిపించిన ఈ కొత్త స్మార్ట్ గ్లాస్ మెటాలిక్ ఫ్రేమ్తో రెండు లెన్స్ కలిగి ఉంటుంది. దీన్ని యూఎస్బీ కేబుల్ సాయంతో స్మార్ట్ఫోన్కు అనుసంధానం చేసుకోవచ్చు. ఇది వైర్లెస్ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి స్మార్ట్ఫోన్ను ఉపయోగించి జియో గ్లాసెస్ను కంట్రోల్ చేయవచ్చు.
కేవలం 75 గ్రాముల బరువుండే ఈ స్మార్ట్ గ్లాసెస్ 100 అంగుళాల వర్చువల్ డిస్ప్లేగా కళ్ళ ముందే గాలిలో తేలియాడే స్క్రీన్ను చూపిస్తుంది. బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేయడానికి ట్రాక్ ప్యాడ్ కంట్రోల్స్ ఇందులో ఉంటాయి. ఆడియో కోసం రెండు వైపులా స్పీకర్లతోపాటు మైక్రోఫోన్ ఉండటం వల్ల వాయిస్ కాల్స్ను రిసీవ్ చేసుకోవచ్చు.
4000mAh బ్యాటరీ కలిగిన ఈ జియో స్మార్ట్ గ్లాసెస్ ఒక ఫుల్ ఛార్జింగ్తో మూడు గంటలు పనిచేస్తాయి. రెండు వెర్షన్లలో లభించనున్న ఈ స్మార్ట్ గ్లాస్ ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఏడాది చివరి నాటికి ఈ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లో లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ధర కూడా అప్పుడే వెల్లడవుతుందని సమాచారం.