Vantara: జంతువుల సంరక్షణే లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ సంస్థలు సోమవారం వంతారా (Vantara) కార్యక్రమాన్ని ప్రారంభించాయి. దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా గాయపడిన, హింసకు గురవుతున్న, ప్రమాదకర స్థితుల్లో ఉన్న జంతువులను రక్షించి, చికిత్స అందించి, తగిన జాగ్రత్తలతో పునరావాసం కల్పించడం కోసం తాను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ బోర్డ్స్ డైరెక్టర్ అనంత్ అంబానీ తెలిపారు.
గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లోని రిలయన్స్ కంపెనీ చెందిన రిఫైనరీ కాంప్లెక్స్లోగల గ్రీన్ బెల్ట్లో 3,000 ఎకరాల విస్తీర్ణంలో ‘వంతారా’ ను ఏర్పాటు చేసింది. దేశంలో ఈ తరహా జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ తరహా జంతుసంరక్షణ కేంద్రాల్లో.. ముందువరుసలోగల వాటిలో ఒకటిగా నిలువాలని ‘వంతారా’ లక్ష్యంగా పెట్టుకుంది. ‘వంతారా’ ప్రాంగణంలో 650 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో రెస్క్యూ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ప్రోగ్రామ్ కింద ఇప్పటికే 200 ఏనుగులు, వేలాది ఇతర జంతువులు, సరీసృపాలు, పక్షులను రక్షించారు. ఖడ్గమృగం, చిరుతపులి, మొసళ్ల పునరావాసంతో పాటు కీలక జీవజాతులను సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. ఈశాన్య భారతదేశం నుంచి ఒక జత ఆసియాటిక్ నల్ల ఎలుగుబంట్లను కూడా కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ సమయంలో అవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాయి. ‘వంతారా’లో వాటికి ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ అందించారు. చికిత్స తర్వాత ఈ ఎలుగుబంట్లు పూర్తిగా కోలుకున్నాయి. ఇప్పుడు అవి సంతోషంగా జీవిస్తున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ బోర్డులలో డైరెక్టర్ అయిన అనంత్ అంబానీ నాయకత్వంలో ఈ ‘వంతారా ఇనిషియేటివ్’ ప్రాణం పోసుకుంది. ‘వంతారా’ ప్రాజెక్టు కోసం రిలయన్స్ ఫౌండేషన్.. వెనెజులా నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ జూస్, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కలిసి పనిచేస్తోంది. దేశంలో నేషనల్ జూలాజికల్ పార్క్, అస్సాం స్టేట్ జూ, నాగాలాండ్ జూలాజికల్ పార్క్, సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్ లాంటి సంస్థల సహకారం తీసుకుంటున్నది.
ఇదిలావుంటే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్నాయి. బిజినెస్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, రాజకీయ తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు.