న్యూఢిల్లీ: భారత్ (India), కెనడా (Canada) మధ్య దౌత్యపరమైన విభేదాలు మళ్లీ వేడెక్కాయి. భారత్లో దౌత్య సిబ్బందిని (Diplomatic Staff) తగ్గించడంపై అధికారిక ప్రకటన చేసిన కెనడా.. న్యూఢిల్లీ అల్టిమేటం అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ అక్కసు వెళ్లగక్కింది. ఈ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ కెనడాకు దీటుగా బదులిచ్చింది. చట్టాలకు అనుగుణంగానే తాము కెనడాకు దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని సూచించినట్లు స్పష్టం చేసింది.
భారత్లోని 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి రప్పించామని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ (Melanie Joly) శుక్రవారం ఉదయం చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్పై ఆమె మరోసారి ఆరోపణలు చేశారు. ‘భారత్లో దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించకపోతే అదనంగా ఉన్న వారికి దౌత్యపరమైన రక్షణలు ఎత్తివేస్తామని ఢిల్లీ అల్టిమేటం ఇచ్చింది. ఇది అసమంజసం, అనూహ్య నిర్ణయం. దౌత్య సంబంధాల కోసం ఏర్పాటు చేసుకున్న వియన్నా ఒప్పందాన్ని ఢిల్లీ ఉల్లంఘించింది’ అని మోలానీ ఆరోపించారు.
దాంతో భారత విదేశాంగ శాఖ (MEA) కెనడా ఆరోపణలను తిప్పికొడుతూ శుక్రవారమే ఓ ప్రకటన చేసింది. ‘భారత్లో దౌత్య సిబ్బంది సంఖ్యపై కెనడా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను చూశాం. భారత్లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంతేగాక మన అంతర్గత వ్యవహారాల్లో వారు తరచూ జోక్యం చేసుకుంటున్నారు. న్యూఢిల్లీ, ఒట్టావా దౌత్య సంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలని మేం కోరుకుంటున్నాం. దీని గురించి గత నెల రోజులుగా కెనడాతో చర్చలు జరిపాం. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 11.1 నిబంధనలకు అనుగుణంగానే దౌత్య సిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు మేం చర్యలు తీసుకున్నాం. సమానత్వ అమలును నిబంధనల ఉల్లంఘనగా చిత్రీకరించే ప్రయత్నాలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
కాగా, ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇదే సమయంలో భారత అంతర్గత విషయాల్లో కెనడా దౌత్యవేత్తలు అతిగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ.. దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం పాటించాలని సూచించింది. ఈ క్రమంలోనే భారత్లో కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని న్యూఢిల్లీ అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించినట్లు కెనడా తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు ఇండియా కౌంటర్ ఇచ్చింది.