చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై క్రిమినలన్ కేసులు నమోదు చేయాలని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. “జనతా చునేగీ అప్నా సీఎం” అనే క్యాప్షన్తో పంజాబ్లో నకిలీ ప్రచారానికి ఆప్ తెర తీసిందని సిద్ధూ ఆరోపించారు. సీఎంను నేరుగా ఎన్నుకునేందుకు టెలిఫోన్ కాల్స్ను నిర్వహిస్తున్నదని, ఇది ఆచరణీయమైన చర్య కాదని విమర్శించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిందన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ ఒక ‘స్కాంస్టర్’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధూ మండిపడ్డారు. తన డర్టీ ట్రిక్స్ ద్వారా పంజాబ్ ప్రజలను మోసం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నకిలీ వార్తల హైబ్రిడ్ మోడల్ను ఆప్ సృష్టించిందని ఆరోపించారు. పంజాబ్లో ఆప్ సీఎం అభ్యర్థి కోసం అరవింద్ కేజ్రీవాల్ ఒక నంబర్ను ప్రారంభించారని తెలిపారు. దీని ద్వారా 21 లక్షల మెసేజ్లు అందినట్లు ఆయన చెప్పారని, అయితే ప్రైవేట్ నంబర్కు ఒక రోజులో ఐదు వేలకు మించి సందేశాలు లేదా ఫోన్ కాల్స్ రావన్నారు. ఈ నేపథ్యంలో ఇది ప్రజలను మభ్యపెట్టే మోసమని విమర్శించారు. ఆయన (కేజ్రీవాల్) మాస్క్వెరేడర్ అని, నకిలీ ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.