Reel stunt : సోషల్ మీడియాలో రీల్స్ కోసం కొందరు చేసే హడావుడి శృతి మించుతోంది. వాళ్ల తీరు జన జీవనానికి ఇబ్బందులు కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీలో సోషల్ మీడియాకు చెందిన ఇద్దరు ఆకతాయిలు చేసిన పనికి పోలీసులే బాధితులుగా మారాల్సి వచ్చింది. రద్దీగా ఉన్న వంతెనపై రీల్స్ కోసం కారు ఆపడమే కాకుండా.. అడ్డుకున్న పోలీసులపైనే వారు చేయి చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రదీప్ ఢాకా అనే వ్యక్తి అతడి స్నేహితుడితో కలిసి పశ్చిమ్ విహార్లోని ఓ ఫ్లైఓవర్పై కారు ఆపి రీల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అంతటితో ఆగకుండా కారు డోర్ తెరిచి ప్రయాణించారు. దీన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు వాళ్లని ఆపి నిలదీశారు. నిబంధనల ప్రకారం రూ.36,000 జరిమానా విధించారు. దాంతో ఆగ్రహించిన ఆ ఇద్దరూ పోలీసులపై చేయి చేసుకున్నారు. బ్యారికేడ్లకు నిప్పంటించారు.
పైగా వాళ్లేదో ఘనకార్యం వెలగబెట్టినట్లు దీన్నంతా షూట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కారులో ప్లాస్టిక్తో తయారు చేసిన కొన్ని నకిలీ ఆయుధాలు కూడా లభ్యమయ్యాయి. కారు ప్రదీప్ తల్లి పేరు మీద రిజిస్టరై ఉన్నట్లు గుర్తించారు. గతంలోనూ ప్రదీప్ పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది.