Ashok Gehlot | న్యూఢిల్లీ, జూలై 27: రెండు దశాబ్దాల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అజ్మీర్ సెక్స్ స్కాండల్లో(మభ్య పెట్టి లైంగిక దోపిడీ చేయడం) ప్రస్తుత రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లాట్ సహా పలువురు కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉన్నదని ఇటీవల పదవి నుంచి ఉద్వాసనకు గురైన మంత్రి రాజేంద్ర గుఢా ఆరోపించారు. శాంతికుమార్ ధరివాల్, మహేశ్ జోషి తదితర నాయకులకు నార్కో టెస్టులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే అసలు నిజం బయటపడుతుందని తెలిపారు. ఈ నెల 21న ఈ సెక్స్ స్కాండల్పై ‘అజ్మీర్ 92’ సినిమా విడుదలైంది. తర్వాత కొద్ది రోజులకే రాజేంద్ర గుఢా ఈ సెక్స్ స్కాండల్లో కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉన్నదని ఆరోపణలు చేయడం గమనార్హం.
అజ్మీర్ నగరంలో వందకుపైగా బాలికలు, యువతులు లైంగిక దోపిడీకి గురయ్యారని దైనిక్ నవజ్యోతి దినపత్రికలో 1992 ఏప్రిల్ నెలలో వచ్చిన కథనాలు సంచలనం సృష్టించాయి. ఈ సెక్స్ స్కాండల్లో రాజకీయ నాయకుల పాత్ర ఉన్నదని.. బడులు, కళాశాలలకు వెళ్లే బాలికలు, యువతుల నగ్న ఫొటోలను, వీడియోలను తీసి వారిని బ్లాక్మెయిల్ చేశారని వార్తలు వచ్చాయి. దీనిపై అప్పటి రాజస్థాన్ సీఎం భైరావ్ సింగ్ షెకావత్ కఠిన చర్యలు తీసుకోమని పోలీసులను ఆదేశించినా.. క్షేత్ర స్థాయిలోని అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈలోగా నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేశారు. సుమారు 250 మంది బాధితుల్లో అతి కొద్ది మంది మాత్రమే ధైర్యంగా ముందుకొచ్చి వాంగ్మూలం ఇచ్చారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజాగ్రహం పెల్లుబికడంతో చివరకు ఈ కేసును సీఐడీకి అప్పగించారు. సీఐడీ ఈ కేసును విచారించి కొందరిని అరెస్ట్ చేసింది. 1998లో అజ్మీర్ కోర్టు ఎనిమిది మంది దోషులకు జీవిత ఖైదు విధించింది. కానీ 2001లో రాజస్థాన్ హైకోర్టు అందులో నలుగురిని నిర్దోషులుగా పేర్కొంది. 2003లో మిగిలిన నలుగురి జైలు శిక్షను సుప్రీంకోర్టు పదేండ్లకు కుదించింది. ఇంకా ఆరుగురిపై విచారణ కొనసాగుతున్నది.